Tuesday, September 20, 2011

అక్షరమా

మది జారిన శూన్యంలో.. నువ్వూ కరిగిపోయావా?
నీకై తపన కరువని కాలంతో కదిలిపోయావా??

మదిలో మిణుగురు మెరుపుకే
అరగడియైనా ఆలస్యంలేని నీ ఆగమనం..
అందంగా అర్థవంతంగా ముస్తాబయ్యి
కలంలో సిరాలా జాలువారి
పొందిగ్గా ఒదిగిపోయే నీ రూపం.

రెప్పల వెనుక రంగుల్లో ఉండగా చటుక్కున వచ్చే నీ ఙ్ఞాపకం.
నన్నొదిలి వెళ్లేదానివా, తెల్ల కాగితాన్ని నలుపు చేసేంత వరకూ..
రవ్వంత బాధలో ఉంటే, ఒడిలో చేర్చుకుని అందించే ఓదార్పు నీదే కదా.
కొండంత సంతోషంలో ఉంటే నీ ఈ కూతురి నవ్వుని నలుగురికీ పంచేదీ నువ్వే.

ఇదంతా ఒకనాటి మాట 

అలా కళ్లు మూసి తెరిచానో లేదో
కాసిన్ని నెలలు కరిగిపోయాయి గోడమీద.
ఇంతలో ఏమైందో ఏమో,
ఉలుకూ పలుకూ లేని నువ్వు.. నా ఎదురుగా..
ఒక తలంపుకే నన్ను వరిస్తావనుకున్నా.
కానీ ఎన్నెన్ని పిలుపులకి సైతం నీ కరుణ దొరకలేదే.

మనసుని ఎంతని మధించను నిన్ను రప్పించడానికి?
భావాల్ని ఎన్నని వరించను నువ్వు వర్ణించడానికి?
దేనికీ చలనం లేని నిన్ను చూసి
దుఃకిస్తున్న మది ఓదార్పుకైనా రావు కదా..

అయినా ఊహల గేలానికే అందని నువ్వు
కలమంచున కరగడానికెలా వస్తావు?
మనసు పేజీలో లేని నీ సంతకం
సిరాలో కలవడం ఎలా సాధ్యం?

ఆరోజు..అద్వితీయమైన అనుభూతికి మాత్రమే నీ ఆసరా కరువైన రోజు.
అది అనుభూతి గొప్పదనం.
ఈరోజు..కనీసం అనుభవానికైనా నీ ముసుగు వెయ్యలేని రోజు..
ఇది ఖచ్చితంగా నా పరాభవం.

నాకు తెలిసిన నీ గురించి చెప్పాలంటే..
నీ స్పర్శ చాలు, తెల్లని శూన్యం కాస్తా
అంబరాన్నంటే ఆనందంగా మారగలదు
అగాధాలను స్పృశిస్తూ లోతుల్ని కొలవగలదు
చరిత్ర పుటల్లోని చరణాలను వినిపించగలదు
నిజం..
నీ ఒక్క అడుగు చాలు, అంతులేని మది నింగిని తెరిచి చూపించగలదు.

మరి అలాంటి నువ్వు ఎందుకు నేస్తం నా చెంతకు చేరవు..

Friday, September 16, 2011

బ్లాగ్లోకంలో మీతో నేను

మధుర అన్నట్లు.. ప్రతి మనిషికీ తన గురించి ఎదుటి వాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఉంటుంది (ఇక్కడ మీకు ఏదైనా సినిమా కానీ సీన్ కానీ గుర్తొస్తే అది నా తప్పు కాదు అధ్యక్షా). అలాగే నా గురించి చాలా మంది రాసినవి చూసి చాలా సంతోషించాను. మరి నా మనసులో ఎవరెవరు ఎలా ఉన్నారో కూడా చెప్పాలి కదా. బజ్జులో మొదలు పెట్టిన లిస్ట్, బ్లాగు టపా అయింది..

ఈ లిస్ట్ మొదలు పెట్టగలిగాను అంటే మొదటగా నేను బ్లాగులోకి రాగలిగిన రోజుని తలుచుకునే తీరాలి. అనగనగా ఒక శనివారం.. అంటే 19 జూన్,2010 ఈనాడు పేపర్‌లో మొదటిసారిగా ఒక బ్లాగు గురించి చదివాను. నాకు బాగా గుర్తు, "జెర్మనీ లో కూస్తున్న తెలుగు కోయిల" అని పరిచయం. అక్కడ మొదలయిన ఆసక్తి, మధుర "బరువు-బాధ్యత" టపా తో ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగి పెద్దదయింది. నాకిప్పటికీ మధుర అంటే మొదటగా గుర్తొచ్చేది బరువు - బాధ్యతే.. ఆ తరువాత మిస్.పనిమంతురాలు (1,2). ఆ వెంటనే ఇంకా చాలా గుర్తొస్తాయి:)) ఆ ముచ్చట్లు వింటూ ఉంటే, చాలా విషయాలు అరే నాకు కూడా ఇలాగే జరిగిందే అనిపించేది. ముఖ్యంగా వాళ్ల అమ్మగారి మాటలు, మాట్లడే కొన్ని పదాలు (ఉదా :ఇగం) నాకు చాలా దగ్గరగా అనిపించాయి. మంచుగారి టపాతో (మధుర పెళ్లి రోజు వేసిన టపా) తనది మా ఊరే అని తెలిసి నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు.

ఆ తరువాత నాకు తెలిసిన బ్లాగు, బ్లాగాడిస్తా రవి గారిది :). ఒక్కటి కూడా వదలకుండా అన్నీ చదివేశా. ముఖ్యంగా దినాల గురించి ఆయన రాసిన టపా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇంకొద్ది రోజులకి మహిళా దినోత్సవం, అమ్మల దినోత్సవం, నాన్నల దినోత్సవం, అన్నల తమ్ముళ్ల దినోత్సవం లాగా, అర్థ దినోత్సవాలు కూడా వచ్చేస్తాయేమో అన్న అనుమానం భలే నవ్వు తెప్పిస్తుంది. కానీ ఆ తరువాత రవి గారు పద్యాలు రాసేస్తూ దినదినాభివృద్ధి చెందడంతో (మరి నాకు అంత తెలుగు రాదుగా :(( ) అటువైపు వెళ్లడం కాస్త కాస్తగా తగ్గింది.

ఇక తరువాత నేను చదివిన బ్లాగు ఏంటంటే.. ఏంటంటే.. ఏంటంటే.. ఇంతగా ఊరిస్తున్నా అంటే అర్థం అయిపోయి ఉండొచ్చు మీ అందరికీ.. యస్ యస్ అదే.. ఏ బ్లాగులో అయితే టపా పడగానే కామెంట్ల వరదలు వస్తాయో, ఏ బ్లాగులో అయితే హాస్యం, వ్యంగ్యం, ప్రేమ, అభిమానం అన్నీ సమపాళ్లలో కలిపి రంగరించి చదువరులని నవ్వించి నవ్వించి ఏడిపిస్తారో, అదే తెలుగు బ్లాగర్ల అభిమాన బ్లాగు మన "జాజిపూలు". ఈ బ్లాగు గురించి నేను ఎంత తక్కువ చెబితే అంత మంచిది.  మరి నే చెప్పే మాటలేవీ ఆ బ్లాగుతో సరితూగలేవు కదా.. కానీ నాకు దొరికిన ఒక అరుదైన ఙ్ఞాపకం మాత్రం అలా ఉండిపోతుంది. జాజిపూలు బ్లాగులో మొదటి సెంచరీ నాదే. :) కొన్ని సంవత్సరాలుగా అభిమానిస్తున్న ఎవరికీ దక్కని ఆ అవకాశం నాకు దక్కినందుకు నా మీద కట్టిన కక్షలు, కుతంత్రాలు.. ఎంతగా ఎంజాయ్ చేశామో.. ఎప్పటికీ నా మనోఫలకం మీద చెరిగిపోని ముద్రలు జాజిపూలతో నాకున్న ఙ్ఞాపకాలు:) నాకు అన్ని ఙ్ఞాపకాలు మిగిల్చిన టపా "గురువులను పూజింపుము పెళ్లి చేసుకోకుము". ఇప్పటికీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటా ఆ టపా, అందులో వ్యాఖ్యలు:)


అలా వందవ వ్యాఖ్య కోసం జరిగిన అల్లర్లలో, నాకు నేస్తం అయిన మరో మంచి బ్లాగరు హరే కృష్ణ:) "నేస్తం గారి టపాలో వంద కామెంటు కొట్టేసినందుకు గొడవేసుకోడానికి వచ్చాను" అంటూ చేసిన అల్లరి, అలా అలా నా బ్లాగులో సెంచరీ పూర్తి చేసిన విషయం ఇప్పటికీ గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాను. హరే అనగానే, మొదట నాకు గుర్తొచ్చేది బ్లోకిరి.. ఆ టపా చదువుతూ ఎంతగా నవ్వుకున్నానో. అంతేనా, అసలు హాలీవుడ్ ఎలా ఉంటుందో తెలీని నాకు, బోలెడు హాలీవుడ్ సినిమాలని పరిచయం చేశాడు.

అదే సమయంలో పరిచయం అయిన మరో ముగ్గురు మంచి బ్లాగర్లు, నేస్తం అక్కకి ముద్దుల తమ్ముళ్లు , నాగార్జున, సాయి ప్రవీణ్, వేణూరాం (ఈయన అప్పటికి బ్లాగరు కాదులే). అప్పటి వరకూ నాకు "మనసు పలికే" అన్న బ్లాగుమరోటి ఉందని తెలీదు. అదీ నాదే అనుకుని నాగార్జున నన్ను బోల్డు సార్లు "ప్రసీద" గారు అని పిలిచేవాడు, నేను ప్రసీద గారిని కాదు మొర్రో అన్నా వినిపించుకోకుండా :). తరువాత నిజం తెలుసుకుని నాకు బోలెడు సారీలు చెప్పాడులే;). నాగార్జున టపాలంటే నాకు వాళ్ల కాలేజి హాస్టల్‌లో దీపావళి సంబరాలు గుర్తొస్తాయి. ఇక సాయి ప్రవీణ్ విషయానికొస్తే, నేస్తం గారిని చూస్తే నన్ను బంగారం అని పిలిచే అక్క గుర్తొస్తున్నారు అనగానే "ప్లీజ్ అపర్ణ గారు, నాకు మీ అక్క వివరాలు ఇవ్వండి. ఆ అక్క ఈ అక్క ఒకరే అయ్యుండొచ్చేమో" అని బ్రతిమిలాడారు:) వేణూరాం అలియాస్ రాజ్‌కుమార్, ఈయన టపాలు అంటూ అప్పటికి లేకపోయినా కామెంట్లతో జనాల్ని పిచ్చెక్కించేవాడు. ఒక కామెంటులో ఎవరో అనగా గుర్తు, "వేణూరాం టపాలు రాయడు కానీ, ఈ కామెంట్లన్నీ కలిపితే తోటరాముడి కన్నా మంచి కామెడీ టపా అవుతుంది" అని. అది నిజమని తరువాత నిరూపించుకున్నాడు :)) (సోదర సోదరీమణులారా..తోటరాముడి అభిమానుల్లారా..  ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.. నేను కూడా తోటరాముడి గారి అభిమానురాలినే ) తోటరాముడి గారి టపాలు చదివి ఎంతగా నవ్వుకున్నానో, అంతగా రాజ్ టపాలు కూడా చదివి నవ్వుకున్నా నేనైతే :)ముఖ్యంగా సుమను సినిమాలు, ఇండస్త్రీలో ఇంకొన్ని సినిమాల రివ్యూలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. రాయడం ఒకటేనా? అంతకన్నా గొప్ప ఫోటోగ్రాఫర్. ఏటికొప్పాక హస్త కళా వైభవం, శిల్పారామం ఫోటోలు చూస్తే అర్జెంటుగా అక్కడికి వెళ్లిపోవాలనిపిస్తూ ఉంటుంది.

ఇక ఆ తరువాత, మాలికలో హారం లో ఎక్కడ మంచి టైటిల్ కనబడితే అక్కడికి దూరిపోయి బోలెడు మంచి మంచి బ్లాగుల తలుపు తట్టాను. అదే విధంగా ఎందరో గొప్ప గొప్ప బ్లాగర్లు కూడా నా బ్లాగు తలుపు తట్టి నన్ను ప్రోత్సహించారు. అందులో ముందుగా నేను చెప్పుకోవలసింది కొత్తపాళీ గారి గురించి. కొత్తపాళీ గారి "పెరడు వ్యవసాయం - గోంగూర రుచి" టపా చదివి చాలా నచ్చి వ్యాఖ్య పెట్టాను. అందరూ "కొత్తపాళీ గారి టపా చాలా గంభీరంగా ఉంటుంది అన్న అభిప్యారం ఇక్కడితో మారిపోయింది" అనగా విని అమ్మో అనుకున్నాను. మిగిలిన కొన్ని టపాలు చదివాక చాలా గౌరవం ఏర్పడింది. ఒకానొక రోజు నా బ్లాగులో ఏం రాయాలో అర్థం కాక సలహాలు అడుగుతూ రాసిన "నేను నా మనసు" టపా చూసి, ఆ వెనువెంటనే " నన్ను నేను కోల్పోయాను" అన్న నా మొదటి కవిత చదివి రాసిన వ్యాఖ్య " ఇంత చక్కటి భావుకమైన వాక్యం రాసిన మీరు ఏం రాయాలో తెలియట్లేదు అంటే నమ్మడానికి మేం వెర్రికుట్టెలం కావాలి. :) " ఈరోజుకీ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వారికి ధన్యవాదాలు మాత్రమే చెప్పడం చాలా తక్కువ అవుతుంది.

కాస్త గంభీరం అయింది కదూ.. ఇప్పుడు కాసిని నవ్వుల్లోకి వెళదాం:) అదేనండీ మన శివరంజని ఎర్రబస్సు దగ్గరికి:) నవ్వులతో చంపేసే అల్లరి పిల్ల. తలుచుకుంటే చాలు, మొదట నవ్వు, ఆ తరువాత తను రాసిన పేరు టపా, ఎర్రబస్సు టపా పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి. మొదటగా నేను చదివిన టపా "నువ్వు నాకు నచ్చలేదు నచ్చలేదు". ఆరోజు అక్కడ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. దెబ్బకి పోలియో వచ్చి పడిపోయిన తన బ్లాగు లేచి పరిగెట్టినట్లు శివరంజనే స్వయంగా చెప్పింది మరి:) కొంతమంది కలిసి లీటర్లు లీటర్లు పోలియో మందు తాగిస్తే పరిగెట్టదూ మరి?? ఒక అందమైన అల్లరి తెలుగు కోనసీమ అమ్మాయి అలా కళ్ల ముందు తిరుగుతూ ఉంటుంది అల్లరిగా, తన తలపు రాగానే:)

అమ్మో అందరిగురించి చెబుతూ మా గురూ గారి గురించి చెప్పకపోతే ఎలా??? బులుసు సుబ్రహ్మణ్యం గారు:) నవ్వితే నవ్వండి అంటూ ఆగకుండా నవ్వాల్సిందే అనిపించేలా రాస్తూ కడుపుబ్బ నవ్వించే హాస్య చక్రవర్తి:) మొదటగా ఆయన హాస్యాస్త్రానికి నేను బలయిన టపా "సతీ ద్రౌపది పాకం" కడుపు నొప్పొచ్చేలా నవ్వాను. అభిమానిని అయిపోయాను. ఆ తరువాత నా టపా చదివి అయిడియా వచ్చింది అని చెప్పి రాసిన "నేను ఎందుకు వ్రాస్తున్నాను" సీరీస్. ఎంతగా పొంగిపోయానో :) అంతే ఇంక నాకు గురూ గారు అయిపోయారు. ఇప్పటికీ నేనైతే ఏలూరు బస్సులోనే ఉన్నాను పలక బలపం పట్టుకుని:))

ఇందు.. పువ్వులు, చల్లని వెన్నెల, దానిపై తన సంతకం.. మొత్తంగా వెన్నెల సంతకం:) నిజంగా వెన్నెలంత చల్లని అమ్మాయి. గిలిగింతలు పెట్టే చక్కని ముచ్చట్లు రాతలు. నాకు బాగా గుర్తుండిపోయిన తన రచన "తొలిసారి నిన్ను చూసింది మొదలు" నిజంగా అరకుని చూసి తీరాల్సిందే అన్న కోరికని ఇంకా బలంగా చేసిన రచన అది. మనసులో ఒక ఆలోచనకి అక్షర రూపం ఇంత అందంగా ఇవ్వొచా అన్న ఆలోచన రేకెత్తించిన రచన అది. చిట్టి చీమ కథ అయితే నన్ను కూడా ఒక చిన్న పాపని చేసి కూర్చోబెట్టుకుని చెప్పినట్లు అనిపిస్తుంది. అంత బాగా రాస్తుంది మా వెన్నెల ఇందు:)

వెన్నెల అనగానే మీకు మరో పేరు గుర్తు రావాలే.. నాకు తెలుసు కదా మీ పల్స్ ;). మరి.. రంగులతో దేన్నైనా గుప్పిట పట్టగల చిత్రలేఖనం అందరికీ వస్తందా?? కొన్ని చేతులకే ఆ మహిమ ఉంటుంది. అందులో ఒకరే మన కిరణు. ఒక్క చిత్రలేఖనమేనా.. చిన్నగా చక్కిలిగింతలు పెట్టే పిల్లగాలి లాంటి అల్లరి తనది. అందుకే తన టపాలు కూడా పొట్ట పగిలేలా నవ్వించవు, గిలిగింతలు పెట్టినట్లుగా టపా చదివినంతసేపూ పెదవులపై నవ్వు పువ్వుల్ని అరవిరిసిన విరజాజుల్లా పూయిస్తూనే ఉంటాయి. చదివేసాక కూడా వదలవు మనల్ని ఆ ఆలోచనలు అచ్చం ఆ పూల పరిమళం లాగానే:) అందుకే భావి భారత బెంగుళూరు పౌరులంతా కలిసి తనకి విగ్రహం పెట్టించబోతున్నారు:)). నాకైతే "నేనూ వాచ్ కొనుక్కున్నా కదా" అన్న తన టపా ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది:)

మరి ఈ అల్లరిపిల్లలందరి గురించి ఏకరువు పెట్టి మా అందరి గురూ గారి గురించి చెప్పకపోతే ఎలా?? ఇంకెవరు.. ఘతోత్కచురాలు ;) మాయా శశిరేఖ. నేను మొదటగా చూసింది తన "చెక్కిన చేతులకు జోహార్లు" టపా. అబ్బ. నిజంగా చూడ్డానికి రెండు కళ్లు సరిపోని అంత మంచి దృశ్యాల్ని/ప్రదేశాన్ని తన మాటలతో మనందరికీ చూపించగలిగారంటే ఇంకేం చెప్పగలం. మహానటి సావిత్రి పై తనకున్న అభిమానం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది తన స్కెచెస్ చూస్తూ ఉంటే. ఎంత సీరియస్ టపాలు రాసినా, మాతో కలిసి తను చేసే అల్లరే గుర్తుండిపోతుంది బాగా. "నువ్వు ఎక్కడా తగ్గొద్దు, నేనున్నాగా నీవెనక" అంటూ చిలిపి గొడవల్లో తనిచ్చే ప్రోత్సాహం చిరునవ్వుల్ని పూయిస్తూ ఉంటుంది:)

అయ్యయ్యో.. ఇంకో అల్లరి పిల్ల గురించి చెప్పకపోతే సౌమ్యగారు ఊరుకోరు..;) అదేనండీ మన కావ్య:) ఏదో అలా ఒకటిఈ రెండు భాగాల్లో పూర్తి చేసేసుకునే చిన్న చిన్న కథలు తెలిసిన మనకి, ఏకంగా రెండు  మూడు సీరియల్స్ చకచకా నడిపేస్తూ, నవ్విస్తూ అల్లరి చేసే మన కావ్య. నేనైతే "ప్రేమే నా ప్రాణం" సీరియల్ లో తనిచ్చిన ట్విస్ట్ ని ఇంకా జీర్ణం చేసుకోలేదు తెలుసా. ఇంక తననెలా మర్చిపోతాం..

నవ్వులు కాస్త ఎక్కువయ్యాయా??? మరిప్పుడు భావుకత్వం లోకి దూకేద్దామా??? అంతకంటే ముందు ఇంకో ప్రత్యేక వ్యక్తి గురించి చెప్పాలి. నెమలికన్ను మురళి గారు. నెమలికన్ను గారిది నేను మొదటగా చూసిన టపా "ఫ్రీ హగ్స్" బ్లాగు యొక్క పరిచయం. ఆ పరిచయం చూసి ఎంతగా అభిమానం పెరిగిపోయిందంటే, ఏమో చెప్పలేనేమో.. ఏదైనా అంశాన్ని ఆయన వర్ణించే తీరు అద్భుతం. దేని గురించైనా అనాలిసిస్ చేసి దాని లోతుల్ని మనకి చూపిస్తూ ఉంటే ఔరా అనుకోడం నా వంతు అవుతుంది. పుస్తకాల పరిచయం కానీ, బ్లాగుల పరిచయం కానీ, తన చిన్న నాటి ఙ్ఞాపకాలు కానీ..ఏదైనా వర్ణించడం ఆయనకి కొట్టిన పిండేమో అనిపిస్తుంది. నాకైతే "మా భూషణం" ఎంత నచ్చాడో... ఒక మంచి బ్లాగు అయినా, ఒక మంచి పుస్తకం అయినా, ఒక మంచి సినిమా అయినా.. ఏదైనా సరే, మురళి గారి రాతల్లో అందంగా ఒదిగిపోవలసిందే.

మరి నెమలికన్ను గారు పరిచయం చేసిన మరొక అద్భుతమైన బ్లాగరు మురారి గారు (ఫ్రీ హగ్స్). ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అక్షరాల వెంట కళ్లు పరిగెడుతూ ఉంటే అప్పటికే చదివిన దానికి మనసు సంతోషపడుతూ ఇంకా కావాలి అంటూ ఆతృతగా చూస్తూ ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది?? నాకైతే మురారి గారి బ్లాగులో అది కనిపించింది. ఏదైనా భావాన్ని, అనుభూతిని ఆయన పలికించే తీరు అద్భుతం. ఆయన రచన చదివేశాక, మనసు ఒక సంతృప్తితో నిండుకోడం తెలుస్తూనే ఉంటుంది, అదే సమయంలో అప్పుడే అయిపోయిందా అనిపించడామూ సహజమే. ఆయన టపాలన్నీ చదివేశాను. ఇది ముందు ఇది వెనుక అని చెప్పలేని విధంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కనిపిస్తాయి ఆ టపాలన్నీ..

అసలు బ్లాగు లెజెండ్ గురించి మాట్లాడకుండా ఇంత దూరం వచ్చానంటే నన్నేమనాలి..??? ఆయ్..
మంచు పల్లకి. ఆ పేరంటేనే నాకు భలే ఇష్టం. అసలు మంచుగారు ఎవరో తెలీక ముందు ఆయన రాసిన "నాదెండ్లతో ఒక రోజు" చదివాను. ఎందుకో అది ఈరోజుకీ గుర్తుంది. మంచు గారి టపాల్లో నేను గమనించిందేమిటంటే, ఏదో బ్లాగు నడుపుతున్నామంటే నడుపుతున్నాం, ఏదో ఒకటి రాయాలి కదా అని రాయడం కాకుండా అందరికీ ఉపయోగపడే విషయాలు రాస్తారు. నాకు ఆయన రాసిన "కొంచెం గౌరవం" ఆయన మీద చాలా గౌరవాన్ని పెంచింది. "కొన్నాళ్ల తరువాత" టపా నాకు బోలెడంత ఙ్ఞానాన్ని ప్రసాదించింది:) ముఖ్యంగా ప్రతి పోస్టూ శ్రీ రామ అంటూ మొదలు పెట్టడం నాకు బాగా నచ్చుతుంది:))

అమ్మో అసలు తెలియకుండానే ఇంత పెద్ద టపా రాసేశానా.. ఇంకా చాలా బ్లాగుల తలుపులు తట్టాలి. దానికి నా రెండవ టపా ఎదురు చూస్తూ ఉంది. ఈ టపాలో నేను పలకరించని వాళ్లెవరూ కూడా తొందరపడి బాధపడి, నా మీద అలిగేసి, ధర్నాలు గట్రా చెయ్యొద్దని మనవి :) :) మీ అందరినీ కలుసుకోడానికి మరొక టపాతో మీ ముందుకు వస్తాను. అంతవరకూ...
సశేషం..